- కమిషన్ల సూచనల మేరకు సంస్కరణలు చేపడ్తం: సీఎం రేవంత్ రెడ్డి
- పంటల బీమా అమలు చేస్తం
- కౌలు రైతుల రక్షణకు చట్టం
- నియోజకవర్గాల్లో గురుకుల ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు
- పైలట్ ప్రాజెక్ట్ కిందకొడంగల్లో అమలు
- పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు.
శుక్రవారం సెక్రటేరియెట్ లో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను తెరిచామని, ప్రజా భవన్ ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించామన్నారు. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్, సాగునీటి రంగాల పరిస్థితిపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామన్నారు.
రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొ. కోదండరాం, ప్రొ. హరగోపాల్, ప్రొ. విశ్వేశ్వర్ రావు, రమా మేల్కొటే, ప్రొ. రియాజ్, ప్రొ. పురుషోత్తం, గాదె ఇన్నయ్య తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
కౌలు రైతుల రక్షణకు చట్టం
రాష్ట్రంలో కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరి సూచనలు, సలహాల ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకొస్తామన్నారు. రైతు భరోసా పథకం రైతులకు పంటల పెట్టుబడి సాయంగా అందించేదని, ఈ స్కీం ఎవరికి వర్తింపచేయాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు.
నిస్సహాయులకు, నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేయాలని యోచిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని, అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలను అనుసరించాలన్నారు.
ఉపా కేసులు ఎత్తేయాలని కోరాం: ప్రొ. హరగోపాల్
ఉపా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. గత పదేండ్లపాటు రాష్ట్రంలో కొనసాగిన నిర్బంధం, రైతులు, విద్యారంగ సమస్యలపై సీఎం చర్చించినట్లు తెలిపారు.
ఉపా కేసుల ఎత్తివేతపై సానుకూలంగా స్పందించారని, సమీక్ష చేస్తామని చెప్పారన్నారు. పౌర సమాజ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల మీద స్పందించే ప్రభుత్వం కావాలని కోరుకున్నామని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు వెళ్తోందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని సీఎంను కోరగా.. సీఎంవో నుంచి ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ ను పౌర సమాజం కోసం నియమిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
కుల, మత వివక్ష లేకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్
రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా, అన్నింటినీ దాదాపు 25 ఎకరాల్లో ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఏర్పాటు చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కొడంగల్ లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతామని చెప్పారు.
తర్వాత దశలవారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లతో కుల, మత వివక్ష తొలగిపోతుందన్నారు. వీటి ద్వారా విద్యార్థుల ప్రతిభా పాటవాలతో పాటు పోటీ తత్వం కూడా పెరుగుతుందన్నారు. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రూప్ 1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎఎస్సీ ద్వారా నియామకాలు పకడ్బందీగా చేపడతామన్నారు.
ఫసల్ బీమాకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎం ఫసల్ బీమా యోజన సీఈవో, సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రితేశ్ చౌహాన్ తో ఆయన సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎం ఎఫ్బీవై)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరినట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ 2020నుంచి నాటి ప్రభుత్వం ఆ స్కీంను అమలు చేయకపోవడంపై చర్చ జరిగింది. పీఎం ఎఫ్బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగిచేరడంతో వచ్చే సీజన్ నుంచి రైతులు పంటల బీమా పొందనున్నారు. పీఎం ఎఫ్ బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు పరిహారం అందుతుందని రితేశ్ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.