- స్పోర్ట్స్ రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా, ఒలింపిక్స్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటడమే లక్ష్యంగా అత్యుత్తమ క్రీడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో నిర్మించనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు. నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు.
గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, క్రీడాకారులకు శిక్షణ, పోటీలకు అతగ్గట్టుగా ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కిషోర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
