- రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి
- కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
- పీఎంకు రాసిన లేఖ.. పీఎంవో స్పందనపై డిస్కషన్
- చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని సీఆర్ పాటిల్ హామీ
- పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్తో సీఎం రేవంత్ భేటీ
- ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్రను ఒప్పించాలని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం శ్రమశక్తి భవన్లో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎం.అనిల్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధా న్యత, ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి తాను రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి జల్ శక్తికి పంపిన లేఖ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) అధ్యయనం నిర్వహించిందని వివరించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్దగా తేడా లేదని స్పష్టమైందన్నారు. ఆ ముంపులోనూ 50 శాతం నదీ గర్భం (రివర్ బెడ్)లోనే ఉంటుందని కేంద్ర మంత్రి పాటిల్కు సీఎం వివరించారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీటిని సరఫరా చేయలేమని, కాబట్టి 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. అందువల్ల ఎత్తును 152 మీటర్లకు పెంచి బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో విద్యుత్ వినియోగం భారం ఉండదని పేర్కొన్నారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని సీఆర్ పాటిల్ను కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వసతి ఏర్పడుతుందని వివరించారు.
తొలుత సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధికారులతో చర్చలు: సీఆర్ పాటిల్
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ అందిం దని సీఎం రేవంత్ రెడ్డికి జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తొలుత తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు 10 నిమిషాలకుపైగా సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అనుమతులు, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
ప్రాజెక్టులకు సహకరించండి
పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎనెక్స్లో భూపేందర్ యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలకుపైగా సాగిన ఈ భేటీలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని వివరించారు.
ప్రధానిని దూషిస్తే.. బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా?: సీఎం
ప్రధాని మోదీ, ఆయన తల్లిని సోషల్ మీడియాలో దూషిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క కేసైనా పెట్టారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ చట్టం ప్రకారం తెలంగాణలో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టత ఇచ్చారు. వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే, ఈ కేసులో డీఎస్పీ బదిలీపై ఢిల్లీలో పని పాట లేని కొందరు ( పరోక్షంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి) విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారుల బదిలీ అనేది సీఎం విచక్షణాధికారం అని, అది రాజ్యాంగం కల్పించిన బాధ్యతల్లో ఒకటని గుర్తు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలను, విద్యార్థులను, ఇతర పార్టీల లీడర్లను బీజేపీ నేతలు మరింత కఠినమైన పదాలతో దూషిస్తున్నారని మండిపడ్డారు.
