గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖలీజ్ఖాన్ దర్గా సమీపంలో బుధవారం యువకుడిపై హత్యాయత్నం జరిగింది. నలుగురు వ్యక్తులు యువకుడిపై దాడి చేసి గొంతు కోసి పరారైనట్లు సమాచారం. దర్గా సమీపంలో ఓ ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు గంజాయి మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
