మేడిపల్లి, వెలుగు: ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన ఓ మహిళ 8 నెలల శిశువును ఎత్తుకెళ్లిన ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. అప్రమత్తమైన పోలీసులు మూడు గంటల్లోనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఉప్పల్ డీసీపీ సురేశ్ కుమార్ తెలిపిన ప్రకారం.. బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీకి చెందిన కట్టె శివరాం తన భార్య, 8 నెలల కొడుకు వైష్ణవ్ రుద్రాంశ్తో నివాసం ఉంటున్నాడు. నెల రోజుల క్రితం దేవరకొండకు చెందిన దుర్గా భవానీ(32) వారి ఇంటితో పాటు మరో రెండు ఇళ్లలో పని మనిషిగా చేరింది. బుధవారం మధ్యాహ్నం శివరాం భార్య వంట చేస్తున్న సమయంలో బాబును ఆడిస్తాను అంటూ దుర్గా భవానీ చిన్నారిని తీసుకెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వెతకగా ఇద్దరూ కనిపించలేదు. స్థానికులను అడగగా ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. కేవలం మూడు గంటల్లోనే కర్మన్ఘాట్లో నిందితురాలిని అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలికి 2022లో ప్రేమ వివాహం జరిగినప్పటికీ సంతానం లేకపోవడంతో చిన్నారిని అపహరించినట్లు దర్యాప్తులో తేలింది.
