- క్షుద్రపూజలపై హరీశ్రావు వివరణ ఇవ్వాలి
- పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణ ఖజానాను ముంచిన కాళేశ్వరం ప్రాజెక్టు పాపం పూర్తిగా కేసీఆర్దేనని, ఈ ప్రాజెక్టుపై కేటీఆర్ చెబుతున్నవన్నీ బూటకపు మాటలేనని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్లో పర్యటించిన ఆయన డీసీసీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నాణ్యత ఏమిటో డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో బయట పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ద్వారానే ఇప్పుడు సాగునీరు అందుతోందన్నారు. మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని , కాళేశ్వరం పేర లక్షల కోట్లు ఖర్చయ్యేవి కాదని, భారీగా కరెంట్ బిల్లులు కట్టాల్సి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు మళ్లీ జరగకుండా సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జాగ్రత్తలు తీసుకొని నీటిపారుదల శాఖ నిపుణుల సూచనలతో పనులు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదో కిషన్రెడ్డి చెప్పాలన్నారు.
బీజేపీ శకం ముగిసినట్లే..
ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజీపీ శకం ముగిసినట్లు తెలిసిపోతోందని మహేశ్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్లో ప్రశాంత్ కిశోర్ విజయం ఆ పార్టీకి చెంప పెట్టులాంటిదన్నారు. మోదీపై భ్రమలు తొలుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో యథేచ్చగా బియ్యం స్మగ్లింగ్ జరిగిందని, ఆ పార్టీ నాయకులు కోట్ల రూపాయల స్కామ్లు చేశారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి అమ్ముకున్నారన్నారు. సీఎంఆర్ ఇవ్వకుండా ఎగనామం పెట్టిన రైస్ మిల్లర్లను ఉపేక్షించబోమన్నారు.
క్షుద్ర పూజలపై హరీశ్రావు వివరణ ఇవ్వాలి..
హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలు నిజం కాకుంటే, ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలని మహేశ్కుమార్గౌడ్ అన్నారు. కర్నాటక, తమిళనాడులోని కొన్ని ఆలయాలు క్షుద్రపూజలకు ప్రసిద్ది అని, ఆ ఆలయాల్లో హరీశ్ పూజలు చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. తాము అనుమానాలు లేవనెత్తితే వివరణ ఇవ్వకుండా, కోర్టు నోటీసులు పంపించారని, వాటికి సమాధానం ఇస్తామని తెలిపారు.
