అబిడ్స్, వెలుగు: చెంచు గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చూడాలని తెలంగాణ హెచ్ఆర్సీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పలు చెంచు గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. గిరిజన కుటుంబాలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
బ్రహ్మగిరిలోని కృష్ణవేణి గెస్ట్హౌస్లో గిరిజన సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, అటవీ, ఐటీడీఏ, పంచాయతీరాజ్, పోలీసు శాఖ అధికారులతో సమీక్షించారు. బ్రహ్మగిరి హైస్కూల్, వట్టువర్లపల్లి పీహెచ్సీని సందర్శించారు. మల్లయ్యపెంటలో చెంచు గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచు గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
