- పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- భవిష్యత్తులో వినియోగిస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ
- -అడోబ్ సీఈవో శంతను నారాయణ్తో భేటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను భవిష్యత్తులో తిరుగులేని మాన్యుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా పక్కా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్లోని నివాసంలో అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణ్తో సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డ్ సభ్యులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్కు తగ్గట్టుగా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపరంగా చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలపై చర్చించారు. అంతర్జాతీయస్థాయి మాన్యుఫ్యాక్చరింగ్, పర్యావరణహితమైన గ్రీన్ ఎనర్జీ, యువతకు అవసరమైన స్కిల్లింగ్, రీస్కిల్లింగ్తోపాటు ఉద్యోగాలపై ఏఐ చూపే ప్రభావంపై శంతను నారాయణ్ తన ఆలోచనలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ చూపే తీవ్ర పరిణామాలను అంచనా వేస్తూ, రాబోయే రోజుల్లో ఆ కృత్రిమ మేధను పాలనలో సమర్థవంతంగా వినియోగించుకునే మార్గాలపై సీఎం చర్చించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిరంతరం ముందుకు నడిపించేందుకు విజన్ బోర్డ్ సభ్యుడిగా మరింతగా సహకారం అందించాలని శంతను నారాయణ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు.
