క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్ రెడ్డి

క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: క్యాన్సర్ బారిన ప‌డిన వ్యక్తి చికిత్సకు అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అందించి బాధిత‌ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ‌గా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచ‌ర‌ణ్ (35) అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్‌) బారిన ప‌డ్డారు. ఆయ‌న‌కు భార్య లక్ష్మిప్రస‌న్న, కుమార్తెలు ల‌క్ష్మి సుస‌జ్ఞ (6), స్మయ (2 నెల‌లు), త‌ల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధార‌మైన సాయిచ‌ర‌ణ్ క్యాన్సర్ బారిన‌ప‌డ‌డంతో అత‌ని చికిత్సకు కుటుంబ స‌భ్యులు సిద్దిపేట మండ‌లం ఎన్సాన్‌ప‌ల్లిలోని త‌మ ఇంటిని విక్రయించారు. 

అయిన‌ప్పటికీ చికిత్సకు అవ‌స‌ర‌మైనంత డ‌బ్బులు స‌రిపోక‌పోవ‌డంతో వారు సీఎం రేవంత్ రెడ్డిని గ‌తంలో క‌లిసి త‌మ ఇబ్బందుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. చ‌లించిన రేవంత్ రెడ్డి సాయిచ‌ర‌ణ్ చికిత్సకు రూ.5 ల‌క్షలు మంజూరు చేశారు. దాంతో హైద‌రాబాద్ బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుప‌త్రిలో సాయిచ‌ర‌ణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ పూర్తయింది.

 చికిత్సకు అద‌నంగా వ్యయ‌మైన మ‌రో రూ.7 ల‌క్షల‌ను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాల‌ని సీఎం ఆదేశించ‌డంతో ఆ మొత్తాన్ని అధికారులు అంద‌జేశారు. చికిత్స చేయించుకున్న సాయిచ‌ర‌ణ్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర స‌చివాల‌యానికి వ‌చ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ధైర్యంగా ఉండాల‌ని సీఎం సాయిచ‌ర‌ణ్‌కు సూచించారు.