
పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దని.. పార్టీ పదవులతోనే గుర్తింపు, గౌరవం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు . అది రాజకీయాల్లో ఎదుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పారు. గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం.. తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించామని ఈ సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని ఉద్దేశించి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా విజయం సాధించామని అన్నారు.
తాను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసినట్లు చెప్పారు సీఎం. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి ప్రభుత్వంలో పదవులు వరించాయని గుర్తు చేశారు. అందువలన పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దని సూచించారు.
రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయన్న సీఎం.. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని తెలిపారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చెప్పారు.
ALSO READ : ఆర్థిక నేరగాళ్ల లగ్జరీ పార్టీ:లలిత్ మోడీ విందులో మాల్యా పాటల కచేరి
‘‘ అందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలి. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలి.’’ అని పార్టీ కార్యవర్గానికి సూచించారు సీఎం రేవంత్.