గేర్ మార్చాల్సిన అవసరం ఉంది: సీఎం జగన్

గేర్ మార్చాల్సిన అవసరం ఉంది: సీఎం జగన్

వైసీపీ కార్యకర్తలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు  సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.  ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు.  ఇప్పటి వరకు ఒక ఎత్తు అని సీఎం జగన్ అన్నారు.  క్షేత్రస్థాయిలో వైసీపీకి చాలా బలం ఉందని.. 175కి 175  సాధ్యమేనన్నారు.  మరో రెండు నెలల్లో జగనన్న సురక్ష,  వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.   సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరుపై ఇంకా సర్వే కొనసాగుతుందన్నారు. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే.. చాలామందికి టిక్కెట్లు రావొచ్చు, మరికొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. . ప్రజల్లో.. ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు.. టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ వ్యక్తి మన మనిషి కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు సీఎం జగన్‌. సర్వే నివేదిక ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు.  టికెట్ రాని వారు తన మనిషి కాకుండా పోరని.. వారికి మరో పదవి ఇస్తామన్నారు.  టికెట్ రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సీఎం జగన్  దిశా నిర్దేశం చేశారు.  

టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలి.. టిక్కెట్లు ఇవ్వని పక్షంలో మరొకటి ఇస్తాం.. లీడర్‌మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలన్నారు. సర్వేలుకూడా తుది దశలోకి వస్తున్నాయి.. చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయి.. ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు మీ పట్ల వస్తాయి.. అందుకనే ప్రజల్లో మమేకమై ఉండాలని సూచించారు. వచ్చే 2 నెలలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలను మీకు తెలియజేస్తున్నానన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, అలాగే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే రెండు కార్యక్రమాలు చేపడతాం అన్నారు.

మొత్తం 5 దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుంది.. మొదటి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు.. రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేయడానికి వెళ్తారు. ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పిస్తారని.. మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు, తేదీ, వివరాలు తెలియజేస్తారని.. నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు.. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూత నిస్తారని వివరించారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్.

గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు.. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకు వేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయంకాగా, ఆర్గనైజేషన్‌, ప్లానింగ్‌, వ్యూహాలు మరొక ముఖ్యమైన అంశం అన్నారు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి.. విభేదాలను పరిష్కరించుకోవాలి. వచ్చే 6 నెలల్లో వీటిపై దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు.