భద్రతా కారణాల దృష్ట్యా .. బ్లాక్​ కలర్​లోకి సీఎం కాన్వాయ్

భద్రతా కారణాల దృష్ట్యా ..  బ్లాక్​ కలర్​లోకి  సీఎం కాన్వాయ్

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కలర్​ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలనే సీఎం కాన్వాయ్​లో ఉపయోగిస్తున్నారు. రేవంత్ సొంత వాహనం బ్లాక్​ కలర్​ ల్యాండ్​ క్రూజర్ కూడా కాన్వాయ్​లో భాగంగానే ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్​లోని వాహనాలన్నీ ఒకే కలర్​లో ఉండాలని ఇంటెలిజెన్స్​ అధికారులు సూచించారు. దీంతో రేవంత్​కు ఇష్టమైన బ్లాక్​ కలర్​లోకి మిగిలిన వాహనాలను మార్చారు. 

ఇందులో సెంటిమెంటు, వాస్తు వంటివేమీ లేవని సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెలలో వారం రోజులపాటు సీఎం రేవంత్.. దావోస్, లండన్, దుబాయ్ లో పర్యటించారు. ఈ గ్యాప్​లో వెహికల్స్​ అన్నింటికీ బ్లాక్​ కలర్​ కోటింగ్​ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా సీఎం కాన్వాయ్‌‌‌‌లోని కార్లన్నీ ఒకే కలర్​లో ఉండాలి. నంబర్ ప్లేట్లు కూడా ఒకే విధంగా ఉంటుంది. కార్ల ఆర్డర్ మాత్రం తరచూ మారుతుంది. ప్రస్తుతం సీఎం కాన్వాయ్​లో ఉన్న ఏడు వాహనాలకు 0009 అనే నంబర్ ను కేటాయించారు. 

మూవ్​మెంట్​ లీక్.. సెక్యూరిటీ చేంజ్​ 

కాన్వాయ్ మార్పుతోపాటు సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలను సీఎం రేవంత్​ మరింత పటిష్టం చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విధుల్లో ఉన్నవాళ్లలో కొందరిని ఇప్పటివరకు కొనసాగించారు. అయితే సీఎం రేవంత్​ రెడ్డి మూమెంట్​ బయటకు లీక్​ అవుతున్నట్టు ఇటీవల ఇంటెలిజెన్స్ గుర్తించింది. సీఎంను కలిసేందుకు ఏ టైమ్​లో ఎవరు వస్తున్నారు? అనే విషయాలు బయటకు వెళ్తున్నాయి. దీంతో కొత్త సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐఎస్​డబ్ల్యూ ఆధ్వర్యంలో సీఎంకు కొత్త సెక్యూరిటీ టీమ్​ట్రైనింగ్​ తీసుకుంటున్నది. రెండు, మూడు రోజుల్లో వీరు సీఎం సెక్యూరిటీని పూర్తిస్థాయిలో టేకోవర్​ చేస్తారని తెలిసింది. ఇంటెలిజెన్స్​ విభాగంలో గతంలో పనిచేసిన కొందరిని మారుస్తున్నారు.