
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కలర్ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలనే సీఎం కాన్వాయ్లో ఉపయోగిస్తున్నారు. రేవంత్ సొంత వాహనం బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కూడా కాన్వాయ్లో భాగంగానే ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్లోని వాహనాలన్నీ ఒకే కలర్లో ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. దీంతో రేవంత్కు ఇష్టమైన బ్లాక్ కలర్లోకి మిగిలిన వాహనాలను మార్చారు.
ఇందులో సెంటిమెంటు, వాస్తు వంటివేమీ లేవని సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెలలో వారం రోజులపాటు సీఎం రేవంత్.. దావోస్, లండన్, దుబాయ్ లో పర్యటించారు. ఈ గ్యాప్లో వెహికల్స్ అన్నింటికీ బ్లాక్ కలర్ కోటింగ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా సీఎం కాన్వాయ్లోని కార్లన్నీ ఒకే కలర్లో ఉండాలి. నంబర్ ప్లేట్లు కూడా ఒకే విధంగా ఉంటుంది. కార్ల ఆర్డర్ మాత్రం తరచూ మారుతుంది. ప్రస్తుతం సీఎం కాన్వాయ్లో ఉన్న ఏడు వాహనాలకు 0009 అనే నంబర్ ను కేటాయించారు.
మూవ్మెంట్ లీక్.. సెక్యూరిటీ చేంజ్
కాన్వాయ్ మార్పుతోపాటు సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలను సీఎం రేవంత్ మరింత పటిష్టం చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విధుల్లో ఉన్నవాళ్లలో కొందరిని ఇప్పటివరకు కొనసాగించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మూమెంట్ బయటకు లీక్ అవుతున్నట్టు ఇటీవల ఇంటెలిజెన్స్ గుర్తించింది. సీఎంను కలిసేందుకు ఏ టైమ్లో ఎవరు వస్తున్నారు? అనే విషయాలు బయటకు వెళ్తున్నాయి. దీంతో కొత్త సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో సీఎంకు కొత్త సెక్యూరిటీ టీమ్ట్రైనింగ్ తీసుకుంటున్నది. రెండు, మూడు రోజుల్లో వీరు సీఎం సెక్యూరిటీని పూర్తిస్థాయిలో టేకోవర్ చేస్తారని తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంలో గతంలో పనిచేసిన కొందరిని మారుస్తున్నారు.