- అత్యల్పంగా కుమ్రంభీం జిల్లాలో 7 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్లు
- పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. శనివారం రాత్రి పది జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7 డిగ్రీల టెంపరేచర్నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 7.9 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 9, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 9.1, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.5, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 9.6, నిర్మల్ జిల్లా పెంబిలో 9.6, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో 9.8, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్లో రికార్డయ్యాయి. కాగా, హైదరాబాద్ సిటీ పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద అత్యల్పంగా 9.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. మౌలాలిలో 9.8 డిగ్రీలు నమోదైంది. అయితే, ప్రస్తుతం నైట్ టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి.
శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడింది. ఆ ప్రభావంతో మేఘాలు తెలంగాణవైపునకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వారం రోజుల వరకు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని పేర్కొంటున్నారు.
