
- పదిలో 29వ స్థానం రావడంపై కలెక్టర్ సీరియస్
- వనపర్తి జిల్లాలో అధికంగా మ్యాథ్స్ లో ఫెయిల్
- గవర్నమెంట్ హైస్కూళ్లలో బయటపడ్డ సబ్జెక్ట్ టీచర్ల నిర్లక్ష్యం
- ఈ ఏడాది ఫెయిల్ అయితే సబ్జెక్ట్ టీచర్లపై చర్యలకు సిద్ధం
- జిల్లాలో 3507 మందికి 918 మంది ఫెయిల్
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, సబ్జెక్ట్ టీచర్ల నిర్లక్ష్యంతో గతేడాది పది ఫలితాలు నిరాశ పరిచాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వనపర్తి జిల్లా 29వ స్థానంలో ఉండడంపై కలెక్టర్ ఆదర్శ్ సురభి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతేడాది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడంతో ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎం, సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరిపోయింది. అవసరం ఉన్నచోట టీచర్ల సర్దుబాటు చేయడంతో కేవలం అప్ గ్రేడ్ అయిన హైస్కూళ్లు మినహాయిస్తే మిగతా చోట్ల టీచర్ల కొరత లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించినా పదో తరగతిలో ఆశించిన ఫలితాలు మేర రాలేదు.
మ్యాథ్స్ సబ్జెక్ట్ లో అధికంగా, సైన్స్, సోషల్ స్టడీస్ తో పాటు తెలుగు సబ్జెక్ట్ లోనూ ఫెయిల్ కావడంపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. జిల్లాలోని జడ్పీ, గవర్నమెంట్, గురుకుల, ఆశ్రమ, కేజీబీవీ స్కూళ్ల నుంచి 3507 మంది పరీక్షలు రాయగా 918 మంది ఫెయిల్ అయ్యారు. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ పై రివ్యూ నిర్వహించి డీఈఓ, ఎంఈఓ, జీహెచ్ఎంల పర్యవేక్షణ లోపంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అకడమిక్ ఇయర్ లో పది ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఏ స్టూడెంట్ ఫెయిల్ కావద్దని అధికారులను ఆదేశించారు. ఈ అకడమిక్ పది ఫలితాల్లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ టీచర్ బాధ్యులవుతారని వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్
హెచ్చరించారు.
పాఠాలు చెప్పకుండా పైరవీలు..
వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ లోపం అధికంగా ఉంటోంది. ప్రధానంగా హైస్కూళ్లను డీఈఓ, ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెచ్ఎం లతో పాటు ఆయా స్కూళ్ల జీహెచ్ఎం లు పర్యవేక్షణ చేయాలి. వనపర్తి, జోగులాంబ గద్వాల రెండు జిల్లాలకు ఒక్కరే డీఈఓ కావడంతో ఆయన కేవలం సంతకాలకే పరిమితమయ్యారన్న విమర్శలు బలంగా ఉన్నాయి.
దీంతో పాటు కొందరు సబ్జెక్ట్ టీచర్లు డీఈఓ కార్యాలయంలో పాతుకుపోయి తరగతుల వైపు కన్నెత్తి చూడడం లేదు. మరికొందరు సబ్జెక్ట్ టీచర్లు ఉపాధ్యాయ సంఘాల పేరుతో లీడర్లుగా వ్యవహరిస్తూ స్కూళ్లను గాలికొదిలేశారు. డీఈఓ గతేడాది పది ఫలితాలను స్కూళ్ల వారీగా పరిశీలిస్తే టీచర్ యూనియన్ నాయకులు, వివిధ వ్యాపకాల్లో మునిగితేలుతున్న వారి సబ్జెక్టుల్లో అధికంగా స్టూడెంట్స్ ఫెయిల్ అయిన విషయం బయటపడింది.
బాయ్స్ స్కూల్లో ఎక్కువ ఫెయిల్
ఎస్సెస్సీలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్ హై స్కూలులోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్టులో 24 మంది, సైన్సులో 19 ఫెయిల్ అయ్యారు. అన్ని సబ్జెక్టుల్లో కలిపి 73 మంది ఫెయిల్ అయ్యారు. అమరచింత హై స్కూల్లోనూ మ్యాథ్స్ లో 24 మంది ఫెయిల్
అయ్యారు.
పర్యవేక్షణ లోపంతో తగ్గిన ఫలితాలు
వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పర్యవేక్షణ లోపించడంతో పది ఫలితాల్లో అనేక స్కూళ్లల్లో ఫలితాలు తగ్గిపోయాయి. ప్రధానంగా జిల్లా కలెక్టర్, డీఈఓ అందుబాటులో ఉంటున్న వనపర్తి టౌన్ లోనే ఎక్కువ మంది కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్ లో అధికంగా ఫెయిల్ కావడంతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించింది.