
హైదరాబాద్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తొందరగా పరిష్కారించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి ప్రోగ్రామ్ జరగగా కలెక్టర్ అనుదీప్ జనాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 58,59 కింద వచ్చి దరఖాస్తులు, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల అర్జీలను ఎప్పటికప్పడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణికి మొత్తం 180 అర్జీలు వచ్చాయన్నారు. ఈ నెల 15న జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 24 సెగ్మెంట్లకు చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ర్యాండమైజేషన్ ప్రాసెస్ ను కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవోలు సూర్య ప్రకాష్, రవి కుమార్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు
మేడ్చల్లో130 అర్జీలు
శామీర్ పేట: అంతాయిపల్లిలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి 130 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ విజయేంద్రరెడ్డి తెలిపారు. సాధ్యమైనంత వరకు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రంగారెడ్డిలో 295 అర్జీలు
రంగారెడ్డి: కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 295 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు. వాటిని తొందరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.