
ములుగు, వెలుగు : ప్రభుత్వ గుర్తింపు పొందిన విక్రయ కేంద్రాల్లోనే రైతులు కొనుగోలు చేయాలని, వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు అమ్మాలని, విత్తనాలు అధిక ధరలకు, కల్తీ, నాణ్యత లేని విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ములుగు కలెక్టర్ దివాకర హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
విత్తన డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు విత్తన కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్ ఇవ్వాలని సూచించారు. రైతులు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు కూడా భద్రపరుచుకోవాలన్నారు. పోలీస్, వ్యవసాయ శాఖలతో టాస్క్ఫోర్స్ఏర్పాటు చేశామని, వారి ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ, డీఎస్పీ ఎన్.రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.