
బషీర్బాగ్, వెలుగు: ఫలక్నుమాలోని పంచలింగాల ఆలయ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ లీడర్ మాధవీలత కోరారు. ఇదే విషయంపై రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో ప్రజావాణిలో హైదరాబాద్ కలెక్టర్కు సోమవారం ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ పరిధిలోని 3.15 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆధీనంలోకి తీసుకొని, అక్రమంగా ఇండ్లు నిర్మించారన్నారు.
ఈ కబ్జాపై వానరసేన 15 ఏండ్లుగా పోరాటం చేస్తున్నదని, కానీ ఈ విషయంలో కబ్జాదారులపై కలెక్టర్ జాలి చూపించడం విచిత్రంగా ఉందన్నారు. 50 ఏండ్లుగా ఇండ్లు కట్టుకొని ఉంటున్న వారి జీవనోపాధి ఎలా అంటూ బాధ్యత గల కలెక్టర్ మాట్లాడటం సరికాదన్నారు. కబ్జాదారులపై ఉన్న ప్రేమ గుడిమాన్యం, గుడి వెనుక నివాసం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వంద కుటుంబాల జీవనంపై లేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా కబ్జాదారులకు మద్దతుగా కలెక్టర్ మాట్లాడటం మానుకొని, అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేయాలన్నారు. ఆ భూమిని దేవాలయానికి అప్పజెప్పాలని డిమాండ్చేశారు. మూడు వారాలు గడువు ఇచ్చారని, మళ్లీ తాను వస్తానని.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.