‘సీతారామ’ భూ సేకరణ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్

‘సీతారామ’ భూ సేకరణ స్పీడప్​ చేయాలి : కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ కెనాల్స్​ భూ సేకరణ పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్​ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో ఇరిగేషన్, సర్వే ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. సీతారామ కెనాల్స్​ నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణకు వారం రోజుల్లోగా పూర్తి చేసేలా ప్లాన్​చేసుకోవాలన్నారు. కాల్వల ఏర్పాటుతో  భూమి విలువ పెరుగుతోందని రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 

ఆధునిక టెక్నాలజీతో భూ సర్వే చేయాలన్నారు. చెరువుల్లో పూడిక తీసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకెళ్లే విధంగా అవగాహన కల్పించాలన్నారు. చెరువులు, కాల్వల వెంట సుబాబుల్, తాటి, తంగేడు మొక్కలను పెంచాలని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్లు కాశయ్య, సుమ, ఇరిగేషన్​ ఎస్ఈ శ్రీనివాస్​రెడ్డి, ఈఈలు అర్జున్​రావు, సురేశ్​కుమార్, అధికారులు పాల్గొన్నారు.