పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

వనపర్తి టౌన్, వెలుగు : మాస్  కాపీయింగ్ కు అవకాశం లేకుండా జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్స్​ పకడ్బందీగా  నిర్వహించాలని కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్  సూచించారు. గురువారం కలెక్టరేట్​లో టెన్త్​ పరీక్షల నిర్వహణపై సీఎస్, డీవో, ఎంఈవోలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఈ నెల18 నుంచి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలపై  అవగాహన కల్పించారు. పరీక్షల నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,906 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. సెంటర్లలో సౌలతులు కల్పించాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రైవేట్  స్కూళ్లలో ఫీజులతో సంబంధం లేకుండా హాల్  టికెట్  ఇచ్చేలా ఎంఈవోలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఇన్​చార్జి డీఈవో గోవిందరాజులు, గణేశ్ కుమార్  పాల్గొన్నారు.

నారాయణపేట : జిల్లాలో నిర్వహించే టెన్త్​ ఎగ్జామ్స్​కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​ వీడియో కాన్ఫరెన్స్  హాల్ ​లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 38 సెంటర్లు ఏర్పాటు చేయగా, 7,678 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. 38 మంది చీఫ్  సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్​మెంటల్  ఆఫీసర్లు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్  టీమ్​ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏఎస్పీ లింగయ్య, డీఈవో అబ్దుల్  గని, డీటీవో యాదగిరి పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్ : జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవో గోవిందరాజులు సూచించారు. కలెక్టరేట్  ప్రజావాణి హాల్​లో సమావేశం నిర్వహించారు. 59 సెంటర్లు ఏర్పాటు చేయగా, 10,500 మంది ఎగ్జామ్స్​కు హాజరవుతున్నట్లు చెప్పారు. కాపీయింగ్  జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.