గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీ 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమోదించారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులు, ఇతర నిధుల ద్వారా రూ. 24.84 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, విద్యుత్ బిల్లులు, జీతాలు, ఇతర ఖర్చుల కోసం రూ. 27.56 కోట్లు అవుతుందని ప్రస్తావించారు.
ఆస్తి పన్ను వసూళ్లలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను గద్వాల మున్సిపాలిటీ ‘ఫర్ఫార్మెన్స్ గ్రాంట్’కు ఎంపికైందని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 8.5 కోట్ల స్టాంపు డ్యూటీ నిధులపై కూడా చర్చించారు. పట్టణంలో ఫ్లెక్సీల నియంత్రణ, ప్లాస్టిక్ నివారణపై కౌన్సిల్ తీర్మానం చేయాలని కలెక్టర్ సూచించగా, గతంలో అభివృద్ధికి రూ. 18 కోట్లు ఖర్చు చేశామని, రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరిన్ని నిధులు తెచ్చి పట్టణ సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
