ఆయుష్ సేవలను అందించాలి : కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఆయుష్  సేవలను అందించాలి : కలెక్టర్  పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో అలోపతి వైద్యంతో పాటు ఆయుష్  సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  పి ఉదయ్ కుమార్  ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో ఆయుష్, హెల్త్ అండ్ వెల్​నెస్  సెంటర్ల డాక్టర్లు, ఫార్మసిస్టులు, సిబ్బందితో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్ సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఆలోపతి వైద్యంతో పాటు ఆయుర్వేద, యునాని, హోమియోపతి సేవలను అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఆయుర్వేదం, పంచకర్మ వైద్యసేవలను ఈ నెల చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

 ప్రకృతి వైద్యానికి నాగర్ కర్నూల్​ కేరాఫ్‌‌ అడ్రస్​గా నిలిచేలా ఆయుష్  డాక్టర్లు కృషి చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖ ఆఫీసులో ఆయుష్  విభాగాన్ని ఏర్పాటు చేసి నోడల్  ఆఫీసర్​గా సీనియర్  డాక్టర్  గోపాల్ ను నియమించి ఆయుష్  డాక్టర్ల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. మీటింగ్​కు హాజరు కాని డాక్టర్లకు షోకాష్​ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ వో సుధాకర్ లాల్  పాల్గొన్నారు.