
కరీంనగర్ టౌన్,వెలుగు: తెలంగాణ జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆదివారం కోతిరాంపూర్ లోని పోచమ్మ దేవాలయంలో కలెక్టర్ పమేలాసత్పతి బోనమెత్తి, పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బోనాలు ఆత్మ గౌరవానికి, ఐక్యతకు, సమష్టికి, ఘనమైన చరిత్రకు నిదర్శనమన్నారు.
ప్రతి ఇంటిలోనూ బోనాల సంబరాలు ఘనంగా జరుపుకుంటారన్నారు. తెలంగాణ జీవన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. జిల్లా ప్రజలందరి పైనా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యుఒ సరస్వతి, పాల్గొన్నారు.