పాపన్నపేట, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏడుపాయల మహాజాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సక్సెస్ చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం ఏడుపాయలలో అడిషనల్ కలెక్టర్ నాగేశ్ అధ్యక్షతన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. అధికారులతో కలిసి దుర్గమ్మ జాతర పోస్టర్ రిలీజ్ చేశారు. వనదుర్గ అమ్మవారి ఆలయం, జాతర పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు జరిగే ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఏర్పాట్లకు సంబంధించిన పనులను స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
జాతర సందర్భంగా అదనపు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. చలువ పందిళ్ల వద్ద ఫైర్ సేఫ్టీ మెషీన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని, 150మంది గజ ఈతగాళ్లు, రెండు ఫైర్ ఇంజన్లు, అందుబాటులో ఉంచాలన్నారు. 5 చోట్ల మెడికల్ క్యాంప్లు, నాలుగు 108 అంబులెన్సులు, లక్ష ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు, 28 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు.
నలుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 45 మంది ఏఎస్సైలు, 96 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 250 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, 234 మంది హోంగార్డులు, 14 మంది మహిళా హోంగార్డులతో కలిపి 829 మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. నిర్వహించారు. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు.
