గవర్నమెంట్​ స్కూళ్లల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కలెక్టర్​ ఉదయ్​కుమార్

గవర్నమెంట్​ స్కూళ్లల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కలెక్టర్​ ఉదయ్​కుమార్

అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందని కలెక్టర్​ ఉదయ్​కుమార్  పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్​ స్టేడియంలో గురువారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల జోన్​ స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట మూడోసారి జోనల్  స్థాయి క్రీడలకు ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు.

నాగర్​ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల విద్యార్థిను పాల్గొంటున్నారని, ఈ పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. మూడు రోజుల పాటు అండర్–14, 17 విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, లాంగ్ జంప్, హైజంప్, హ్యాండ్​ బాల్, అథ్లెటిక్​ పోటీలు నిర్వహించనున్నారు. మున్సిపల్  చైర్మన్​ నర్సింహగౌడ్, ఆర్డీవో గోపీరాం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట డీటీడబ్ల్యూవోలు కమలాకర్​రెడ్డి, రాజ్ కుమార్, శంకర్, ఏటీడబ్ల్యూవోలు లక్ష్మారెడ్డి, బాలకృష్ణ, ఎంఈవో రామారావు, సీఐ అనుదీప్​ పాల్గొన్నారు.