పాక్ వంకర తోకను కత్తిరిస్తాం.. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

పాక్ వంకర తోకను కత్తిరిస్తాం.. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి

ప్రధాని మన్​కీబాత్​ 122 వ ఎపిసోడ్​ను  సనత్​నగర్​లో కేంద్రమంత్రి ప్రజలతో కలిసి వీక్షించారు. మోదీ చెప్పిన విధంగా  స్వచ్ఛత, యోగా, డయాబెటీస్​ లాంటి విషయాలను ఆచరణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ ...మన్​ కీ బాత్​... ప్రజలను జాగృతం చేస్తుందని ఐక్యంగా నిలబెడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. ఇందులోని ప్రధాని చేసిన సూచనలు, సలహాలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి కోరారు.

ఉగ్రవాదులు దాడిచేస్తే ప్రతి దాడి చేస్తామనే విధంగా .. మోదీ ప్రభుత్వం చేసి చూపించిందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు.  ప్రాణాలు కోల్పోయిన వారికి  గులాబీపూలతో.. క్యాండిల్స్​ వెలిగించి నివాళులర్పించే విధానానికి మోదీ స్వస్తి చెప్పారని ... ఒక్కరిని చంపితే వంద మందిని చంపుతామనే విధంగా పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్​ ఉగ్ర మూకల శిబిరాలను భారత్​ ధ్వంసం చేసిందని మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. 

ఆపరేషన్​ సింధూర్​ తో గట్టి సందేశం..

 ఆపరేషన్​ సిందూర్​ తో 9 ఉగ్రస్థావరాలను పాక్​ భూభాగంలోకి చొరబడి మరీ ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఇందులో భారత సైనికుల పాత్ర కీలకమన్నారు. ఈ ఆపరేషన్​ లో విశాఖకు చెందిన ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సమయంలో నిర్వహిస్తున్న తిరంగ యాత్రలు, ర్యాలీల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని దేశ ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను కూడా అంబర్​ పేట్​, జూబ్లీహిల్స్​, నాంపల్లి, ముషీరాబాద్​ లలో ర్యాలీలు నిర్వహించానని చెప్పారు. ఉగ్రదాడులపై పాక్​ ‘కుక్క తోక వంకర’ అన్నట్లే ప్రవర్తిస్తే ఆ తోకనే కత్తిరించేస్తామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి హెచ్చరించారు.