బల్దియాలో ప్రక్షాళన షురూ.. అవినీతికి ఆస్కారం లేకుండా కమిషనర్ కర్ణన్ మార్క్ పాలన

బల్దియాలో ప్రక్షాళన షురూ.. అవినీతికి ఆస్కారం లేకుండా కమిషనర్ కర్ణన్ మార్క్ పాలన
  • బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లో పలు చర్యలు
  • అవినీతికి ఆస్కారం లేకుండా అడుగులు
  • ఇప్పటికే జీహెచ్ఎంసీలో భారీగా బదిలీలు
  • త్వరలో డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు కూడా!

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన షురూ అయ్యింది. పాలనపై కమిషనర్ ఆర్వీ కర్ణన్​మార్క్​కనిపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 29న బాధ్యతలు స్వీకరించిన కర్ణన్ రెండు నెలల్లోనే పలు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా బల్దియాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపై తనదైన తీరులో యాక్షన్ తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 27మందిని బదిలీ చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో కూడా కొన్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విభాగంతోపాటు మెడికల్ ఆఫీసర్లు, చివరగా డిప్యూటీ కమిషనర్లను కూడా ఒక్కసారిగా బదిలీ చేసేందుకు కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా డీసీల ట్రాన్స్‎ఫర్లకు రంగం సిద్ధం అయినట్లు తెలిసింది. మరోవైపు ప్రతి విభాగంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనులు చేయని అధికారులకు వార్నింగ్‎లు సైతం ఇస్తున్నారు. 

అడిషనల్ కమిషనర్ల కుదింపుతో సైలెంట్..

జీహెచ్ఎంసీలో కమిషనర్ తరువాత అడిషనల్ కమిషనర్లదే(ఏసీ) కీలకమైన బాధ్యత ఉంది. గ్రేటర్‎లో ఉద్యోగులు ఎంతమంది ఉండాలనే దానిపై 2008లో ప్రసాద్ రావు కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ లెక్కన ఆరుగురు ఏసీలు మాత్రమే ఉండాల్సి ఉంది. కానీ త్వరగా పనులు అవుతాయని ఇంతకిమించి ఏసీలను నియమించారు. చివరగా 20 రోజుల కింద వరకు 14 మంది ఏసీలు కొనసాగారు. 

ఇంతమందికి పనిలేదని గుర్తించిన కమిషనర్ ఈ సంఖ్యను ప్రస్తుతం 9కి తగ్గించారు. ముగ్గురు ఏసీలు ఈ నెల 12న బదిలీపై వెళ్లగా, మరో ఇద్దరిని నాలుగు రోజులక్రితం కమిషనర్ సీడీఎంఏలో రిపోర్టు చేయాలని రిలీవ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 9 మందిలో కూడా ఇంకొందరిని తగ్గించే అవకాశముంది. ఏసీలను కుదించడంతో ఒక్కసారిగా అధికారుల్లో సైలెంట్ వాతావరణం నెలకొంది.

ఓ వైపు విజిలెన్స్, మరోవైపు ఇంటెలిజెన్స్

జీహెచ్ఎంసీలోని కొన్ని విభాగాలపై ఏసీబీతో పాటు విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా భవనాలకు అనుమతులు ఇచ్చే టౌన్ ప్లానింగ్, మెయింటెనెన్స్ పనులు చేసే ఇంజినీరింగ్ అధికారులపై నిఘా పెట్టింది. మరోవైపు బర్త్ అండ్ డెత్ సెక్షన్‎పై ఇప్పటికే కమిషనర్ ఆర్వీ కర్ణన్ చర్యలు తీసుకున్నారు. బర్త్ డెత్‎లో అడ్డగోలుగా ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతుండడంతో అసలు ఎందుకిలా జరుగుతుందన్న దానిపై ఇంటెలిజెన్స్ అధికారులతో నివేదిక తెప్పించుకున్నారు.

 ఇందులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా 17మంది కంప్యూటర్ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులపై ఇదే తరహాలో ఫోకస్ పెట్టనున్నారు. అవినీతికి పాల్పడే వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదన్న విధంగా కమిషనర్  చర్యలు తీసుకుంటున్నారు.