
ములుగు, వెలుగు : ములుగు జిల్లా కేంద్రం హనుమాన్ నగర్ సీతారామాంజనేయస్వామి ఆలయం (శ్రీ క్షేత్రం) కు సంబంధించిన ఎకరం ఒక గుంట భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని ఆలయ భూ పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆలయానికి చెందిన భూమిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలోని ఈదమ్మగడ్డ వద్ద అతి ప్రాచీనమైన పవిత్ర స్థలం హనుమాన్ ఆలయానికి చెందిన ఒక ఎకరం ఒక గంట భూమి 409/A/అ, 409/A/ఆ సర్వే నంబర్లలో ఉందని, ఆలయ భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారన్నారు.
పట్టణంలో చాలాచోట్ల ప్రభుత్వ ఖాళీ భూములు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా హనుమాన్ ఆలయ స్థలాన్ని మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారని, 163 హైవేని ఆనుకొని ఉండటంతో అక్రమార్కుల కన్ను పడుతోందన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, ఇలాగే కొనసాగితే ఆలయ, హిందూ, ప్రజా సంఘాలతో కలిసి ఆలయ భూ రక్షణ కోసం పోరాడుతామన్నారు. కార్యక్రమంలో హనుమాన్ ఆలయ భూ పరిరక్షణ కమిటీ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, సిరికొండ బలరాం, వాసుదేవ రెడ్డి, పౌడాల ఓం ప్రకాశ్, కొత్త సురేందర్, శ్రీ క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తదితరులున్నారు.