- హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్
తిమ్మాపూర్/ కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వచ్చే మార్చి 31లోగా పూర్తిచేసి, గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కోతిరాంపూర్, అలుగునూర్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కలెక్టర్పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు.
ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ‘ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. పనులు ఎలా చేయిస్తున్నారు.. ఇసుక.. ఇటుక.. కంకరకు ఎంత ధర చెల్లిస్తున్నారు.
బిల్లులు సకాలంలో వస్తున్నాయా..? నిర్మాణ పనుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పటివరకు పనులకు ఎంత ఖర్చు చేశారు..?’ అని ఆరా తీశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రోగ్రెస్ చాలా బాగుందని కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అధికారులను ఎండీ అభినందించారు. మొదటిదశలో ప్రారంభించిన ఇండ్ల తుది పనులు మార్చి 31పూర్తి కావాల్సిందేనన్నారు. అనంతరం సిటీలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్లో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో ఎండీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
