పూర్తయిన కత్వా వాగు బ్రిడ్జి .. ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు

పూర్తయిన కత్వా వాగు బ్రిడ్జి .. ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు

ఆమనగల్లు, వెలుగు: మండలంలోని మేడిగడ్డ తండా–శంకర్ కొండ తండా మధ్య ప్రధాన రహదారి కత్వా వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లుగా వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వాగు ఉధృతి పెరిగి రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆందోళనలు, ధర్నాలు చేయడంతో బీఆర్ఎస్  హయాంలో​అప్పటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  మూడుసార్లు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారని చెప్పారు.

 కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక తాము దీక్షలు చేపట్టడంతో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.10 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. 8 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంతో వివిధ తండాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.