భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. కొత్తగూడెంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి జీఎం ఆఫీసులు, సింగరేణి భవన్ను తగలబెట్టాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది సింగరేణిపై బతుకుతున్నారని గుర్తు చేశారు.
ఇప్పటికే బొగ్గు బావులు మూత పడుతుండడం, కొత్త బావులు ప్రారంభం కాక యాజమాన్యంతో పాటు ఉద్యోగులు ఆందోళన చెందుతున్న క్రమంలో సుమన్ వ్యాఖ్యలు సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో సంస్థలో అశాంతి పెరిగి, ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన ఆయన సింగరేణి ఆస్థులను తగలబెట్టాలని పిలుపునివ్వడం విచారకరమన్నారు.
