వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తయ్ : బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తయ్  : బండి సంజయ్

తన పదవి పోతుందన్న భయంతోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్టున్నారన్న ఆయన.. రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటెలరాజేందర్ ఎక్కడ అనలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చానని మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు  బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేస్తుందన్న బండి సంజయ్.. రాజ్దీప్ సర్దేశాయి కూడా.. బీఆర్ఎస్ దేశమంతా పార్టీలకు ఆర్థిక సాయం చేస్తుందనే అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికి ఎలాంటి ప్రూఫ్ లు ఉన్నాయని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం ఇవే మాటలు అంటున్నారన్న ఆయన..  బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఇదే విషయం ప్రచారం అయిందని ఆయన చెప్పారు. మునుగోడు ఓటర్లు స్వయంగా మాట్లాడుకున్నారని తెలిపారు. అతిక్ అహ్మద్ లాంటి గూండా కోరు చనిపోతే ఎంఐఎం సంతాప సభలు పెట్టడం ఏంటి అని నిలదీశారు. అతని మరణం పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్పందించడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. తెలంగాణకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవసరమా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి బండి సంజయ్ పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు నేషనల్ ఓబీసీ మోర్చా, రాజ్య సభ మెంబెర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.