న్యూఢిల్లీ: రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును ఇండియా ఆపేస్తోందంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కామెంట్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రె స్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఆసియాన్ సమిట్ జరుగుతున్న కౌలాలంపూర్లో ఆదివారం మోదీ ‘హగ్లో మసీ(కౌగిలింతల దౌత్యం)’ కనిపించకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
‘‘శనివారం రాత్రి కౌలాలంపూర్కు బయలుదేరిన ట్రంప్.. విమానంలోనే మీడియాతో మాట్లాడారు. రష్యన్ క్రూడ్ ఆయిల్ను తగ్గించుకుంటామని మోదీ హామీ ఇచ్చారని ఇన్నిరోజులూ చెప్తూ వచ్చిన ఆయన.. ఈసారి ఇండియా రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను పూర్తిగా ఆపేస్తోందని అన్నారు.
అందుకే కౌలాలంపూర్లో ఆసియాన్ సమిట్కు వెళితే.. ట్రంప్ తనను కార్నర్ చేస్తారన్న భయంతోనే మోదీ వెళ్లలేదు. అందుకే కౌలాలంపూర్లో మోదీ ‘హగ్ లోమసీ కనిపించకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు” అని జైరాం అన్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ను ఆపానని 53 సార్లు, రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు ఇండియా తగ్గిస్తోందంటూ ఐదు సార్లు ట్రంప్ కామెంట్లు చేశారని జైరాం ఇదివరకు చెప్పారు.

