
- కేసీఆర్ సర్కారు రూ.98,391 కోట్ల అప్పులు చేసింది
- ఇరిగేషన్పై శ్వేతపత్రం రూపొందించిన కాంగ్రెస్ సర్కారు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు ఖర్చుచేసి 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల కింద లక్ష ఎకరాల్లోపే కొత్త ఆయకట్టు వచ్చిందని, మిగతా 16 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ప్రాజెక్టుల కిందనే వచ్చిందని నిర్ధారించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ శ్వేతపత్రం సిద్ధం చేసింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని కేసీఆర్ నమ్మకస్తుల ప్రమేయం లేకుండా, లీకులకు తావివ్వకుండా శ్వేతపత్రం రూపొందించారు.
త్వరలోనే అసెంబ్లీ స్పెషల్సెషన్నిర్వహించి ఇరిగేషన్పై శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.93,872 కోట్లు ఖర్చుచేసినా కొత్తగా 98 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు రూ.37,514 కోట్లు, సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టుకు కలిపి రూ.8,634 కోట్లు, డిండి లిఫ్ట్ స్కీంకు రూ.2,987 కోట్లు, చనాఖా–కొరాటాకు రూ.1,093 కోట్లు, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.399 కోట్లు, మోడికుంటవాగు రూ.65 కోట్లు, గట్టు ఎత్తిపోతలకు రూ.119 కోట్లు, జగన్నాథపూర్ ప్రాజెక్టుకు రూ.192 కోట్లు ఖర్చు చేసినా వాటి కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.