అందుకే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు

అందుకే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు

అధిష్టానం ఆదేశిస్తే  పీసీసీ పదవి తీసుకుంటానని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు.  అధిష్టానం ఇస్తే… పీసీసీ ఎందుకు తీసుకోను.. తీసుకుంటా. సత్తా లేదా…సమర్దుడిని కాదా..? అని ప్రశ్నించారు. ఇవాళ (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ ఎవరైనా అవ్వండి.. కానీ జగన్ ని చూసి నేర్చుకోవాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే… అధిష్టానం ఆలోచన విధానం మారాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు.. నాయకత్వానికి మధ్య చాలా గ్యాప్ ఉందని రాజనర్సింహ అన్నారు. పబ్లిక్ లో ఉండి ప్రజా ఉద్యమాలు చేయకనే తాము విఫలమవుతున్నామన్నారు. కాంగ్రెస్ లో కూడా టిఆర్ఎస్ వెల్ విషర్స్ ఎక్కువ ఉన్నారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టులకు, కాంగ్రెస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయని, అలాంటప్పుడు కాంగ్రెస్ లీడర్లు టిఆర్ఎస్ తో ఎలా కొట్లాడతారని అన్నారు. టిఆర్ఎస్ ని తామెప్పుడూ శత్రువుగా భావించలేదని, 10 ఏండ్లుగా ఆ పార్టీని ఫ్రెండ్లీ పార్టీనే అనుకున్నందుకే ఫెయిల్ అయ్యామని ఆయన అన్నారు.

టిఆర్ఎస్ పార్టీకి నిలకడ లేకే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లను తీసుకుంటున్నారని  రాజనర్సింహ అన్నారు. కేసీఆర్ కు ఎంత పెద్ద త్రేట్ లేకుంటే… మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు.

దేశంలో బీజేపీ పాజిటీవ్ ఓటుబ్యాంకుతో గెలిచిందన్నారు. తెలంగాణలో 4 ఎంపీ స్థానాలను బీజేపీ ఎందుకు గెలిచిందో కాంగ్రెస్ ఆలోచించాలన్నారు రాజనర్సింహ. కిషన్ రెడ్డికి హోంమంత్రి ఇవ్వటం అంటేనే.. టిఆర్ఎస్ కి ఇండికేషన్ ఇవ్వటమేనని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవటంతో… బీజేపీ తో గ్యాప్ ఉంది అని కేసీఆర్ సంకేతాలు పంపారని దామోదర రాజనర్సింహ అన్నారు.