కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తన స్టేట్మెంట్ రికార్డు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కాంగ్రెస్ వార్ రూమ్కు ఇన్ ఛార్జ్ గా తాను ఉన్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులు తన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదన్నారు. వార్ రూమ్ ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేశారని మల్లురవి ఆరోపించారు.
మరోవైపు.. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సునీల్ కనుగోలుకు 41(ఏ) సీఆర్పీసీ కింద మంగళవారం నోటీసులు జారీ చేశారు. సునీల్ అందుబాటులో లేకపోవడంతో నోటీస్ కాపీని మల్లు రవికి ఇచ్చి సంతకం తీసుకున్నారు. తుకారంగేట్కు చెందిన సామ్రాట్ ఫిర్యాదు ఆధారంగా పోయిన నెల 24న కేసు రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్లను కించపరుస్తూ పోస్ట్లు చేశారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సునీల్తో పాటు కాంగ్రెస్ వార్రూమ్కు చెందిన ముగ్గురు సభ్యులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సునీల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు సిటీ సైబర్ క్రైమ్ స్టేషన్లో హాజరుకావాలని సూచించారు. లేకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.