
హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు పూలే గుర్తుకురాలేదా అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు. ప్రజాభవన్కు ఫూలే పేరు పెట్టాక ఫూలే గుర్తొచ్చారా అని ఆమెను నిలదీశారు. శనివారం ఆయన సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో మాట్లాడారు. తొలి టర్మ్లో ఐదేండ్ల పాటు మహిళలకు కేబినెట్లో అవకాశం ఇవ్వనప్పుడు.. కేసీఆర్ను కవిత ఎందుకు ప్రశ్నించలేదని మల్లు రవి అన్నారు. ఫూలే ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన చేశారని ఆరోపించారు.
మహిళలు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని ఫైర్ అయ్యారు. నిర్మాణాత్మకంగా విమర్శలు చేయాలని, మాయ మాటలు చెప్పొద్దని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనను ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సీఎంవో నుంచి కమిషనరేట్లవరకు.. సింగరేణి నుంచి హెల్త్ డైరెక్టరేట్ల దాకా సామాజిక న్యాయం పాటించామని మల్లు రవి
పేర్కొన్నారు.