మీరు అధికారంలో ఉన్నప్పుడు పూలే గుర్తుకురాలేదా ?: కవితపై మల్లు రవి ఫైర్

మీరు అధికారంలో ఉన్నప్పుడు పూలే గుర్తుకురాలేదా ?: కవితపై మల్లు రవి ఫైర్

హైదరాబాద్​, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు పూలే గుర్తుకురాలేదా అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు. ప్రజాభవన్​కు ఫూలే పేరు పెట్టాక ఫూలే గుర్తొచ్చారా అని ఆమెను నిలదీశారు. శనివారం ఆయన సెక్రటేరియెట్​ మీడియా సెంటర్​లో మాట్లాడారు. తొలి టర్మ్​లో ఐదేండ్ల పాటు మహిళలకు కేబినెట్​లో అవకాశం ఇవ్వనప్పుడు.. కేసీఆర్​ను కవిత ఎందుకు ప్రశ్నించలేదని మల్లు రవి అన్నారు. ఫూలే ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్​ పాలన చేశారని ఆరోపించారు.

మహిళలు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని ఫైర్ అయ్యారు. నిర్మాణాత్మకంగా విమర్శలు చేయాలని, మాయ మాటలు చెప్పొద్దని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. కాంగ్రెస్​ పాలనను ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సీఎంవో నుంచి కమిషనరేట్ల​వరకు.. సింగరేణి నుంచి హెల్త్​ డైరెక్టరేట్ల దాకా సామాజిక న్యాయం పాటించామని మల్లు రవి 
పేర్కొన్నారు.