హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీలో ఏడుగురు మహిళలకే టికెట్లు ఇచ్చిన విషయం కల్వకుంట్ల కవితకు తెలియదా అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ప్రశ్నించారు. మంగళవారం ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డిపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. కవితకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్లో మహిళల సీట్ల కోసం పోరాటం చేయడానికి కలిసి రావాలన్నారు.
ఇచ్చిన హామీలడిగితే ప్రభుత్వం పారిపోతున్నది: కాంగ్రెస్ నేత మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలడిగితే రాష్ట్ర ప్రభుత్వం పారిపోతున్నదని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొనే చేవెళ్ల సభలో దళిత డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు.
ఈ నెల 26న చేవెళ్లలో సభ చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళితులకు ఏమేం చేస్తామో సభలో చెప్తామని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో దళిత నాయకులతో ఖర్గే చర్చలు జరిపారని చెప్పారు.