మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు TRS కుట్ర: విజయశాంతి

మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు TRS కుట్ర: విజయశాంతి

టీఆర్ఎస్ ప్రభుత్వంపై  తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడబోతుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంత బరితెగించిందో చెప్పడానికి  హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వార్డుల విభజనను కంటి తుడుపు చర్యగా హైకోర్టు ప్రస్తావించిందంటే ఇక ఎన్నికల్లో ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో చెప్పాల్సిన పనిలేదన్నారు.

ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి అడిగితే అది ప్రతిపక్షాల కుట్ర అంటూ కేసీఆర్  గగ్గోలు పెడుతున్నారంటూ విమర్శించారు. తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెప్పే కేసీఆర్ ..మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ప్రతిపక్షాలను ఓడించాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. హైకోర్టులో విచారణలో మరిన్ని నిజాలు బయటకు వస్తే ప్రభుత్వ బండారం బయట పడటం ఖాయమన్నారు విజయశాంతి.