హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని, అప్రజాస్వామికంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. ఆదివారం రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, మాస్టర్ ట్రైనర్లతో వారిద్దరు వరుసగా జూమ్ మీటింగ్లు నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ‘సర్’పేరుతో ఓట్ల పరిశీలన చేపట్టి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఓట్లను చోరీ చేసి దొంగతనంగా రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా ఓట్ చోరీ చేసే అవకాశం ఉందని నియోజకవర్గాల్లో నాయకులు అప్రమతంగా ఉండాలని సూచించారు.
25 నుంచి బీఎల్ఏ-2లు రంగంలోకి..
ఓటర్ మ్యాపింగ్పై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఇప్పటికే 90% బీఎల్ఏ ట్రైనింగ్ పూర్తయిందని.. ఈ నెల 25వ తేదీ నుంచి బీఎల్ఏ-2లు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓట్లను పరిశీలిస్తారన్నారు. ప్రతి 10 బూత్లకు సూపర్ వైజర్ను, ప్రతి అసెంబ్లీకి ఒక కోఆర్డినేటర్ను నియమించామని తెలిపారు. ఓట్ల మ్యాపింగ్లో తలెత్తే ఇబ్బందులపై ఏఈఆర్ఓ, ఈఆర్ఓలతో మాట్లాడి పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
కాగా, ఈ గంప వేణుగోపాల్ వ్యవహరించగా.. పీసీసీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రాజేశ్ సాంకేతిక వివరాలను వివరించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
