రోడ్ల కోసం.. కాంగ్రెస్ నేతల బిక్షాటన

రోడ్ల కోసం.. కాంగ్రెస్ నేతల బిక్షాటన

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో కాంగ్రెస్ నేతలు బిక్షాటన చేశారు. రుద్రంగి గ్రామంలో రోడ్డు అభివృద్ధి పనులను ప్రభుత్వం, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పట్టించుకోవడం లేదని..నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. రుద్రంగి గ్రామంలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది.  దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు జోలె కట్టి స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇంటి ఇంటి తిరుగుతూ బిక్షాటన చేశారు. రుద్రంగి గ్రామాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దత్తత తీసుకున్నారని..అయినా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు గుంతలమయంగా మారిందని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 

మూడేళ్ల క్రితం రుద్రంగి మండల కేంద్రంలో డివైడర్ కట్టారు. కొత్త రోడ్ వేయకపోవడంతో పాత రోడ్డు పూర్తిగా పాడైపోయింది. గుంతలమయంగా మారింది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దృష్టికి..అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. గుంతల రోడ్డు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహన దారులు కిందపడి తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రుద్రంగి గ్రామం మీద ఎమ్మెల్యే రమేష్ బాబు కక్షకట్టి...రోడ్డు అభివృద్ధి కోసంనిధులు మంజూరు చేయడం లేదా అని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాము ఇంటింటికి తిరిగి బిక్షాటన చేవామని.. ..తమ వంతుగా రోడ్డు బాగు కోసం డబ్బులు పంపిస్తామన్నారు. 

రుద్రంగి గ్రామంలో చిన్న పాటి వర్షం పడితే చాలు గుంతలలో నీరు చేరి బురదమయం అవుతుంది. దీంతో  వాహనాలకు,  ప్రజలకు ఇబ్బందిగా తయారుకావడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుండి నిజామాబాద్, ధర్మపురి, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, వేములవాడ, సిరిసిల్ల జగిత్యాల పలు జిల్లా కేంద్రాలకే కుండా మారుమూల గ్రామాలకు కూడా ప్రతి నిత్యం ఆర్ టీ సి బస్సులు, ప్రైవేట్ వాహనాలు , మోటార్ సైకిల్లు వంటి వాహనాలు ఈ ప్రధాన రహదారి వెంట రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ దారి వెంట పవిత్ర పుణ్యక్షేత్రాలైన ధర్మ పురి, కొండగట్టు, వేములావాడ పుణ్యక్షేత్రాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వాహనాలలో వెల్లిన సందర్బాలు ఉన్నాయి. అయినప్పటికి వారికి ఈ రోడ్డు పరిస్థితి కనిపించలేదా అని గ్రామస్తులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, నిజామాబాద్, ఆర్మూర్ వంటి పట్టణాలలోని హాస్పిటల్ నుండి మెరుగైన వైద్య చికిత్స కొరకు హైదరాబాద్, కరీంనగర్ లోని పెద్ద హాస్పిటల్లకు కూడా రోజు అంబులెన్స్ లు చాలా వెలుతుంటాయి. ఇక్కడి ఎగుడు దిగుడు రోడ్డుతో అంబులెన్స్ లో ఉన్న పేషెంట్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాలని వాపోతున్నారు.