ఎర్రబెల్లీ..పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్థాయికి, కేటీఆర్ స్థాయికి పోలిక పెట్టడం ఏమిటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్లో గురువారం మాట్లాడుతూ ‘కేటీఆర్ను పొగుడుకో, భజన చేసుకో తప్పులేదు. కానీ చెంచాగిరి చెయ్యకు’ అని హితవు పలికారు. మంత్రి పదవి శాశ్వతం కాదని ఎర్రబెల్లి గుర్తుంచుకోవాలన్నారు. సంగారెడ్డికి మంచినీటి ఇబ్బందులకు మంత్రి హరీష్ రావు కారణమని ఆరోపించారు. దీని గురించి మాట్లాడకుండా స్కూళ్లల్లో పిల్లలను లెక్కలు అడుగుతున్నారని, సర్కార్ బడుల్లో చదువులు అధ్వానంగా ఉన్నాయని చెప్పే పనిలో హరీష్ ఉన్నారన్నారు.
అమ్ముడుపోయిన ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి
అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపాలిటీ లను గెలుచుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎన్నికల ముఖ్య అధికారి నాగిరెడ్డి టీఆర్ఎస్కు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలన్నారు.