సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం గాంధీభవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. హరీష్ రావు పుణ్యమాని 2017 నుంచి సంగారెడ్డి నియోజవర్గంలో నీటి కష్టాలు మొదలు అయ్యాయని అన్నారు. గడిచిన మూడేళ్ళ నుంచి సంగారెడ్డి జిల్లా ప్రజలు నీళ్ల కోసం ఆకాశం వైపు చూస్తున్నారని అన్నారు. మంజీరా-సింగూరు డ్యామ్ నీళ్లను సంగారెడ్డి జిల్లాకు చెందకుండా, సంగారెడ్డి ప్రజల బతుకులతో చెలగాటం ఆడారన్నారు. నారాయణ ఖేడ్- జోగిపేట్-పఠాన్ చేరు-జహీరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ టీఆరెఎస్ కావడంతో సంగారెడ్డిలో నీళ్ల కరువు వచ్చిందన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, లేదంటే అడిగేవారు లేరని అన్నారు. సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజల కోసం కాకుండా హరీష్ రావు కోసం మాత్రమే పనిచేస్తున్నారు.
హరీష్ రావు మంత్రి కాదు నీళ్ల దొంగ
హరీష్రావు మంత్రి కాదు..నీటి దొంగ అని తీవ్రంగా మండిపడ్డారు జగ్గారెడ్డి. హరీష్రావు తీరుపై సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని చెప్పారు. గతంలో హరీష్రావుకు ఎందుకు సన్మానం చేశానో తర్వాత ఎపిసోడ్లో చెబుతానని పేర్కొన్నారు. ఆ సన్మానసభలో కేసీఆర్ గురించి హరీష్రావు ఏమన్నాడో త్వరలో బయటపెడతానని చెప్పారు. సెకండ్ ఎపిసోడ్ లో కేసీఆర్ పాస్ పోర్ట్ విషయం కూడా బయటకువస్తదన్నారు. తనపై పెట్టాల్సిన కేసులన్ని పెట్టారని, తాను ఎవ్వరికి భయపడనని చెప్పారు.