కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను తీర్చాలంటూ ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తాను రాసిన లేఖకు సీఎం నుంచి ఈ నెల 8 లోపు సమాధానం రాకపోతే 9న ఒక రోజు దీక్ష చేస్తానన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ..లాక్ డౌన్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రూ.25 వేల కోట్లు ఎలా కేటాయించారన్నారు?. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డబ్బులు ఉంటాయి.కానీ ప్రజల ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు? ఎప్పుడు నీళ్లు వస్తాయో రావో తెలియని కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రెండు లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు..రాష్ట్ర ప్రజల ఆర్థిక ఇబ్బందులు తీర్చడానికి మరో లక్ష కోట్ల అప్పు చేయలేరా అని అన్నారు? రాష్ర్టానికి సహాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎందుకు నిలదీయట్లేదన్నారు. బీజేపీ ,టిఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు.
ప్రధాన డిమాండ్లు
1 . గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును ఏడాది పాటు మాఫీ చేయాలి
2. కరెంటు బిల్లులు రద్దు చేయాలి.
3 . హైదరాబాద్ లో 30వేల లోపు, ఇతర ప్రాంతాల్లో 15 వేల లోపు ఇంటి అద్దె ప్రభుత్వమే 6 నెలలు చెల్లించాలి.
4. EMI లు కూడా ప్రభుత్వమే 6 నెలలు భరించాలి.
5. నీటి బిల్లులు సంవత్సరం పాటు రద్దు చేయాలి .
6. పరిశ్రమ లకు కూడా కరెంటు బిల్లు మాఫీ చేయాలి..