
- అవినీతి బీఆర్ఎస్ నేతలను ఎన్కౌంటర్ చేయాలె
వరంగల్, వెలుగు : కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న టైంలో ‘కుడా’కు సంబంధించిన రూ. 20 కోట్లను దారి మళ్లించి హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్లో ఆదివారం నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి ఇచ్చిన నిధులు.. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో జరిగిన అభివృద్ధిపై భద్రకాళి ఆలయం వద్ద చర్చకు రావాలని సవాల్ చేశారు.
‘బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు.. కశ్మీర్లో అమాయకులను చంపిన వారు ఇలాంటి లీడర్లను ఎన్కౌంటర్ చేయడం బెటర్’ అని అన్నారు. పదేండ్ల పాటు ప్రజాసొమ్మును దోచుకున్న బీఆర్ఎస్ లీడర్లను జైలులో పెట్టాలని అన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో రూ.600 కోట్లతో పాటు కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ వడ్డేపల్లిలో 5 హత్యలు చేయించారని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై 32 కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్ బాలసముద్రంలో కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ ఆఫీస్ పేరుతో కబ్జా చేశారని, ఏదో ఒక రోజు తానే ఆ గేటు ముందు కూర్చుంటానని హెచ్చరించారు.
భద్రకాళి చెరువు పూడికతీతను ఏనాడు పట్టించుకోని బీఆర్ఎస్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రకాళి అమ్మవారి పనుల్లో అవినీతికి పాల్పడినా, లంచాలు తీసుకున్నా వినయ్ భాస్కర్ మాదిరి గతి పడుతుందని ఎద్దేవా చేశారు. వాతావరణ కారణాల వల్ల ఈ సారి పూర్తి కాని చెరువు పూడికతీత పనులను వచ్చే ఏడాది కంటిన్యూ చేస్తామన్నారు.