
కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బుధవారం కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమీషన్ల కోసం కక్కుర్తి పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్టిమేట్లు పెంచిందని అన్నారు. అంచనాలు పెంచినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ప్రాజెక్టుతో ఖర్చు ఎక్కువ ప్రయోజనం తక్కువని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కేవలం టూరిజం ప్రాంతంగా మిగులుతుందని అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న టీఆర్ఎస్ కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. కేంద్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. రాష్ట్రమే సహకరించడంలేదని కేంద్రం చెబుతోందన్నారు. రెండు ప్రభుత్వాల వైఖరితో రాష్ట్ర ప్రజలపై యాభైవేల కోట్ల రూపాయల భారం పడుతోందని తెలిపారు.
తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టి ఉంటే 4వేల కోట్ల నిర్వహణ భారం తప్పేదని ఆయన అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38 వేల కోట్ల ఎస్టిమేట్ చేస్తే.. అదే ప్రాజెక్టు పేరు మార్చి అదనంగా 50 వేల కోట్లకు పెంచారన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, నిర్వహణ ఖర్చులు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని జీవన్ రెడ్డి అన్నారు. యాభైవేల కోట్ల అదనపు భారానికి సీఎం నైతిక బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు.