సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

 సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 13 వేల 500 పోస్టులకు నోటిఫికేషన్ ను వారంలో వేయాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అక్కడే వదిలేశారని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని..? భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? అని ప్రశ్నించారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని చెప్పారు. 

ALSO READ :చంద్రయాన్ 3 : విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీసిన ప్రజ్ఞాన్ రోవర్.. నవ్వమ్మా నవ్వు..

రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఓవైపు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారి స్థానాల్లో కొత్తవారిని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా..? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా..? అని లేఖలో ప్రశ్నించారు. 

2020 డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారు.ఎంతో ఆర్భాటంగా 13500 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.. తీరా మీరు ప్రకటించిన డిఎస్సిలో మాత్రం 5000 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదన్నారు. ఉమ్మడి  రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో 6 నెలలకు ఒకసారి టెట్‌, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేవారని గుర్తుచేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. 

13 వేల 500 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఉన్నత విద్యామండలి ముట్టడికి ప్రయత్నిస్తే.. మహిళలు అని చూడకుండా విచక్షణ రహితంగా పోలీసులు కొట్టారని చెప్పారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలను గుర్తించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రకారం.. 13 వేల 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను వారం రోజుల్లో వేయాలని డిమాండ్ చేశారు.