కాంగ్రెస్ పాలమూరు సభ వాయిదా..కారణాలివే

కాంగ్రెస్ పాలమూరు సభ వాయిదా..కారణాలివే

నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్  నిర్వహించనున్న ‘పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభ’ వాయిదా పడింది. ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడినట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు ఏఐసీసీ సమాచారం ఇచ్చింది. అయితే ప్రియాంక గాంధీ సభ వాయిదా పడటంతో గద్వాల జెడ్పీ చైర్మన్ సరితా, ఆమె భర్త తిరుపతయ్య బెంగుళూర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

ప్రియాంక గాంధీకి పాలమూరు సభకు ఆహ్వానిస్తూ జులై  మొదటి వారంలోనే టీపీసీసీ లేఖ రాసింది. ప్రస్తుతం ఆమె షెడ్యూల్ అందుబాటులో లేకపోవడంతో ఈ సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది.  విదేశీ పర్యటనలో ఉండడం, ఆమె ఇండియా తిరిగి రాకపోవడంతో కొల్లాపూర్ షెడ్యూల్ ఖరారు కాలేదని ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేసినట్టుగా సమాచారం. జులై  20వ తేదీన నిర్వహించాల్సిన సభను నెలాఖరులో నిర్వహించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సభ ఎప్పుడుండే అవకాశం..

పాలమూరు ప్రజా భేరీ బహిరంగసభకు సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో ఓ కమిటీని పిసిసి వేసింది.  సభ నిర్వహణతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు ఇంచార్జీలను సైతం నియమించింది. అయితే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడినట్లు ఏఐసిసి నుంచి పిసిసికి, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు సమాచారం అందింది. అయితే జులై 23 తర్వాత అంటే 28న కానీ, లేదా 30వ తేదీన కానీ  సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు కాకపోతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.