మార్చి 8న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్!

మార్చి 8న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్!
  • 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్​
  • పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ
  • తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్​
  • తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు 
  • 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక

న్యూఢిల్లీ, వెలుగు : రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్​ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. గురువారం ఢిల్లీలోని అక్బర్ రోడ్​లోగల ఏఐసీసీ పార్టీ హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం నిర్వహించారు.  పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత)  కేసీ వేణుగోపాల్, ముఖ్యనేతలు జైరాం రమేశ్​, మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి, అధిర్ రంజన్ చౌదరి

అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టీఎస్ సింగ్ డియో సహా సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్చువల్​గా హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్నాటక, కేరళ, ఛత్తీస్​గఢ్​, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై వేర్వేరుగా చర్చించారు. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో పొత్తుల నేపథ్యంలో.. దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఫస్ట్ లిస్ట్ లో 60 పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది. 

తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. సింగిల్ నేమ్స్, ఎలాంటి పోటీ, వివాదాలకు తావు లేని స్థానాలు ఇందులో ఉంటాయని మీటింగ్​లో పాల్గొన్న ముఖ్య నేతలు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.  రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు సాగింది.

పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ అయిన రాష్ట్ర ఇన్​చార్జి దీపా మున్షి, పీసీసీ చీఫ్ రేవంత్.. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి, వడపోసి టాప్ టూ పేర్లతో అశావహుల లిస్ట్ ను తయారు చేసి హైకమాండ్ కు సమర్పించినట్టు తెలిసింది. మొత్తం 14 స్థానాలకు సంబంధించిన ఆశావహుల వివరాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. పలు స్థానాలకు సింగిల్ నేమ్స్ ఉండగా, అసెంబ్లీ ఎన్నికల టైంలో తమ సీట్లను త్యాగం చేసిన వారికి ఎంపీ ఎన్నికల్లో అవకాశం కల్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

అలాగే, ముఖ్యనేతల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్న మరో మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీ అగ్రనాయకత్వానికి వదిలేసినట్టు తెలిసింది. ఈ లిస్ట్ ఆధారంగా ఖర్గే నేతృత్వంలోని సీఈసీ సభ్యులు అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఖమ్మం, భువనగిరి,నాగర్ కర్నూల్ స్థానాలపై పీఠముడి 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఘన విజయం సాధించిన ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కాస్తంత ఇబ్బందికరంగా మారినట్టు నేతలు చెబుతున్నారు. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని సీటు ఆశిస్తున్నారు. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా భట్టి పలువురు అగ్రనేతలను కలిసి లాబీయింగ్ కూడా చేశారు. అలాగే మంత్రులు పొంగులేటి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల తన కుమారుడు యుగంధర్​కు ఈ సీటు కేటాయించాలని కోరుతున్నట్టు సమాచారం.

దీంతో ఫస్ట్ లిస్ట్ లో ఖమ్మం సీటు ప్రకటనకు బ్రేక్ పడే అవకాశం ఉన్నది. అలాగే భువనగిరి నుంచి మంత్రి కోమటి రెడ్డి కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక నాగర్ కర్నూల్ సీటుకు పార్టీ సీనియర్ నేత మల్లు రవి పోటీ పడుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ కు ఆయన రాజీనామా చేసినా..

అది ఇంకా ఆమోదం పొందలేదు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ ను కూడా కలిసి కోరారు. హైకమాండ్ ఆశీర్వాదం తనకే ఉన్నందున, ఆ సీటు తనకే దక్కుతుందని రవి భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్.. ఈ సీటు తనకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. అలాగే మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు ఉండే అవకాశం ఉన్నది.

ఫస్ట్ లిస్ట్ లో రాహుల్ పేరు : ఉత్తమ్

ఫస్ట్ లిస్ట్ లో అగ్రనేత రాహుల్ గాంధీ పేరు కూడా ఉండనున్నది. అయితే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీచేస్తారో లిస్ట్ ద్వారా తెలుపుతామని సీఈసీ మెంబర్- ఉత్తమ్ మీటింగ్ అనంతరం వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్ తొలి లిస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పోటీచేసే అభ్యర్థులపై మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు.  

నేడు హైదరాబాద్​కు సీఎం 

సీఈసీ మీటింగ్ లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్​పోర్ట్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్ లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఇంటి మరమ్మతు పనులను పరిశీలించారు. అక్కడి నుంచి మల్లు రవితో కలిసి యమునా లోని తన క్వార్టర్స్ కు చేరుకున్నారు.

రాత్రి 8 గంటలకు అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ ఆఫీసులో జరిగిన మీటింగ్​కు హాజరయ్యారు. అరగంట పాటు సాగిన ఈ భేటీ అనంతరం తిరిగి తన క్వార్టర్స్ కు చేరుకున్నారు. కాగా మీటింగ్ అనంతరం డిప్యూటీ సీఎం హైదరాబాద్ చేరుకోగా... సీఎం ఢిల్లీలోనే బస చేశారు. శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.

తుది జాబితాలో పరిశీలనలో ఉన్న పేర్లు 

1. మహబూబ్‌‌‌‌గర్ : వంశీచంద్ రెడ్డి 
2. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి 
3. నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి
6. మల్కాజ్ గిరి: చంద్రశేఖర్
7. జహీరాబాద్ : సురేష్ షెట్కార్ 
8. మెదక్ : నీలం మధు
9. నల్లగొండ : జానారెడ్డి/రఘువీర్ రెడ్డి
10. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి 
11. మహబూబాబాద్ : బలరాం నాయక్/ విజయ భాయ్ బానోతు 
12. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు 
13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్ 
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
15. హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన
16. వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు 
17.ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత