
- వాటికి బదులు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను పెంచుకునే వెసులుబాటు
- త్వరలో పదవులు పెంపు.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
- తెలంగాణలో లక్కీ పోస్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్
- అధిష్టానం నిర్ణయంతో ఆశావహుల్లో నిరాశ
హైదరాబాద్, వెలుగు: పీసీసీలో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండవని ఆ పార్టీ కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. హైకమాండ్ నుంచి కూడా దీనిపై తమకు స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పోస్టులు అవసరం లేదనే భావనతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్య నేత ఒకరు చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటేనే ఇలాంటి పోస్టులతో అధికార పార్టీపై పోరాట పటిమను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించే అవకాశం ఉంటుందని, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నందున ఈ పోస్టుల అవసరం లేదనే భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు ఆ నేత చెప్పారు. అందుకే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలను పీసీసీ కార్యవర్గంలో వారి స్థాయిని బట్టి ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా నియమించుకోవచ్చని ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు.
అందుకే పీసీసీ కార్యవర్గంలో ఈ పదవుల సంఖ్యను పెంచుతున్నట్టు, త్వరలోనే ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా మరి కొందరికి అవకాశం ఇవ్వనున్నట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై గత కొన్ని నెలలుగా ఆశలు పెట్టుకున్న నేతలకు తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే తెలంగాణలో లక్కీ పోస్టుగా పేరుంది. గతంలో ఈ పోస్టులో రేవంత్ రెడ్డి, భట్టి, మహేశ్ గౌడ్, పొన్నం కొనసాగారు. ఇప్పుడు ఆ నేతలు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రిగా కొనసాగుతున్నారు. అందుకే తాము కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రాజకీయంగా తమ దశ, దిశ తిరుగుతుందని ఎన్నో కలలు కన్న నేతలకు పార్టీ నిర్ణయంతో తీవ్ర భంగపాటుకు గురిచేసినట్లయింది.