టికెట్ల వార్ .. ఢిల్లీలో మూడు రోజులుగా కసరత్తు

టికెట్ల వార్ .. ఢిల్లీలో మూడు రోజులుగా కసరత్తు
  • ఇవాళ కూడా  కొనసాగుతున్న స్క్రీనింగ్ కమిటీ భేటీ
  • బీసీ లకు 34 సీట్ల కోసం మధు యాష్కీ పట్టు 
  • 14 –15 సీట్లు కన్ఫాం చేసే యోచనలో కమిటీ
  • హాట్ హాట్ గా కొనసాగుతున్న సమావేశం

ఢిల్లీ: హస్తినలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా కొనసాగుతోంది. రెండో రోజు మురళీధర్ అధ్యక్షతన కాంగ్రెస్ వార్ రూంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం సాగుతోంది. కొత్తగా నియమితులైన సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ నిన్న, ఇవాళ ప్రధానంగా బీసీ టికెట్ల అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. గతంలో హామీ ఇచ్చినట్టుగా 34 సీట్లను బీసీలకు కేటాయించాలని మధుయాష్కీ గౌడ్ పట్టుబడుతున్నారు. అయితే 14 నుంచి 15 సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం బీసీలకు 34 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో తొలిజాబితా వెలువడుతుందని సమాచారం. 35 మంది పేర్లను వెల్లడిస్తారని ప్రచారం జరుగుతుండగా.. అన్ని సీట్లను ఒకే సారి ప్రకటిస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. టికెట్ల ఆశిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే తమ తమ చానల్స్ ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీట్ల కేటాయింపు పూర్తయితే ఆదిలాబాద్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఈ మేరకు మరో వైపు బస్సు యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లనున్నది.